
అభివృద్ధి అంటే 60 అంతస్థుల కట్టడాలా లేక 60 ఏళ్ళు దాటినా ప్రజలు సుఖసంతోషాలతో ఉండటమా?
- తూములూరి మధుసూదనరావు
ఒకనాడు గవర్నమెంట్ ఆదర్శ యజమానిగా ఉండేది (Model Employer). పబ్లిక్ సెక్టర్ సంస్థలు కూడా అలాగే ఉండేవి. తమ సర్వస్వము సేవకు అంకితం చేసిన ఉద్యోగులను వారి జీవితాంతం ఆదరంతో చూసేవారు.
స్కూల్స్ ఇన్స్పెక్టర్ గా రిటైరైన మా మావగారికి ప్రభుత్వం అధికారిక ఫేర్ వెల్ ఉత్సవం నిర్వహించటం నాకు తెలుసు.
అలాగే వారికి 70 ఏళ్ళు నిండినప్పుడు గవర్నమెంట్ అధికారికంగా ఉత్సవం నిర్వహించి సమ్మానం చేయడానికి నేను ప్రత్యక్ష సాక్షిని.
ఈనాడు అటువంటి మానవతా సంబంధాలన్నీ గత స్మృతులు గానే మిగిలి పోయాయి. డిజిటలైజేషన్ సునామీలో మానవసంబంధాలన్నీ మట్టిగొట్టుకు పోతున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ రంగములనే వ్యత్యాసం లేకుండా అన్ని యాజమాన్యములు ఈనాడు ఉద్యోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు.
హైటెక్కలు, ప్రాజెక్టులు అంటూ ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేసి 40 ఏళ్లకే 90 ఏళ్ల వృద్ధులవుతున్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నది అని లెఖ్ఖలు చూపిస్తున్నారు.
అభివృద్ధి అంటే 60 అంతస్థుల కట్టడాలా లేక 60 ఏళ్ళు దాటినా ప్రజలు సుఖసంతోషాలతో ఉండటమా?
వారానికి ఇన్ని రోజులు పని, రోజుకు ఇన్ని గంటల పని అని నిర్దేశించే చట్టాలన్నీ ఏమై పోయాయో తెలియదు. ఇక పెన్షనర్ల సంగతి చెప్పే పనేలేదు. "ఇంకా వీరు ఎందుకు బ్రతికి ఉన్నారా" అనే ధోరణి యాజమాన్యాలలో, ప్రభుత్వాలలో కనిపిస్తోంది.
అసలు పెన్షన్ ఎందుకివ్వాలి? అని గతంలో పెన్షన్ స్కీమ్ నే కొందరు ముఖ్యమంత్రులు రద్దు చేసారు. "పెన్షన్ ఎవరి దయాభిక్ష కాదు, అది డిఫర్డ్ వేజ్ " అని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబట్టే పెన్షనర్లు ఇంకా బ్రతికి ఉన్నారు.
ముఖ్యమైన వయసంతా సంస్థల అభివృద్ధికి ధారపోసి, వార్ధక్యం పాలయిన పెన్షనర్లను వారి జీవితాంతం ఆదరంతో చూడవలసిన బాధ్యత ప్రభుత్వము మరియు సంస్థల యాజమాన్యాలపై ఉన్నది.
మానవత్వాన్ని చంపడం అభివృద్ధి కాదు.
మానవత్వాన్ని బ్రతికించడమే అభివృద్ధి.
- తూములూరి మధుసూదనరావు.