logo

TTD ghee scam: కల్తీ నెయ్యి కేసులో హరిమోహన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో నిందితుడు హరిమోహన్ రాణా బెయిల్‌ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దర్యాప్తు గడువును సీఐబీఐ ఆదేశాల మేరకు సిట్‌ జూలై 15వ తేదీకి పొడిగించింది
కేసు దర్యాప్తు గడువు మరో రెండు నెలలు పొడిగింపు!

నేటి నుంచి టీటీడీలో పలువురిని విచారించనున్న సిట్‌

తిరుపతి, మే 16(ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు హరిమోహన్‌ రాణా బెయిల్‌ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారం డిస్మిస్‌ చేసింది. ఉత్తరాఖండ్‌ భగవాన్‌పూర్‌లోని భోలేబాబా డెయిరీ జనరల్‌ మేనేజర్‌ హరిమోహన్‌ ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇతనిది కీలక పాత్రగా తేలడంతో సిట్‌ అధికారులు మార్చి 20న అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని హరిమోహన్‌ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై ఈనెల 13న వాదనలు జరిగాయి. బెయిల్‌ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదముందని సిట్‌ తరఫున ఏపీపీ జయశేఖర్‌ వాదించారు. దీంతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్‌ చేపట్టిన దర్యాప్తు గడువు పొడిగించారు. ఈనెల 15వ తేదీకి దర్యాప్తు ముగించి, తుది చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. మరో 2 నెలలు గడువు పొడిగిస్తూ సీబీఐ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జూలై 15 నాటికి దర్యాప్తు ముగిస్తారని తెలిసింది. ఇప్పటివరకు 80 శాతం దర్యాప్తు పూర్తయింది. మిగిలిన 20 శాతం దర్యాప్తు టీటీడీకి సంబంధించి జరుగుతుందని సిట్‌ వర్గాలు చెబుతున్నాయి. దర్యాప్తులో వేగం పెంచిన సిట్‌ అధికారులు శనివారం నుంచి పలువురు టీటీడీ ఉద్యోగులు, అధికారులను విచారించనున్నారు. రోజువారీ కొందరిని విచారించనున్నట్లు సమాచారం.

21
767 views