
"అద్భుతంగా అలరించిన "స్వర బృందావనం" 17 వ సంగీత విభావరి "
11.05.2025 న సిటీ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ లో శ్రీ రవికాంత్ శ్రీ కుమార్ ల సంయుక్త సారధ్యంలో "స్వర బృందావనం" 17 వ సంగీత విభావరి అద్భుతంగా నిర్వహించబడింది.
"స్వర బృందావనం" ప్రత్యేకత ను గుర్తించిన ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులు భాగస్వాములందరి పాటలను అత్యంత శ్రద్ధాసక్తులతో ఆలకించి, తమ హర్షాతిశయాన్ని తమ తమ సందేశాలతో వ్యక్తం చేశారు. ఇప్పటికి 570 మంది వీక్షించి పాటల తోటలో విహరించారు.
ముందుగా రాంబాబు శ్రీ వినాయక ప్రార్ధన చేయగా, శ్రీ కుమార్ వసుధ లు "అఖిలాండేశ్వరి" అంటూ అమ్మవారిని స్తుతించారు. చైతన్య సమీర లు "దేవుడెలా ఉంటాడని" అంటూ; దేవుని స్వరూపాన్ని అభివర్ణించారు. తాను బాగుండాలి ఇతరులు నాశనమైపోవాలి అని కోరుకొనేవాడు "రాక్షసు" డని, తాను ఇతరులు బాగుండాలని కోరుకొనేవాడు "మానవు" డని, తాను ఏమైపోయినా ఇతరులు బాగుండాలని కోరుకొనేవాడు "దేవుడు" అనే అద్భుతమైన విశ్లేషణ, మానవులలో నే రాక్షసులు మానవులు దేవుడు ఉంటారనే అపూర్వమైన భావన ఈ పాట లో గోచరిస్తుంది. పిమ్మట రవికాంత్ యశోద లు "ముద్దబంతి నవ్వులో మూగబాసలు" అంటే, శ్రీ కుమార్ అభిమైత్రి లు హిందీ పాట తో అలరించారు. వేదవ్యాస్ యశోద లు "మాటే మంత్రము" అని మాట మంత్రం లాంటిదని తెలియజేస్తే, రవికాంత్ అభిమైత్రి లు "చెలియా చెలియా" అంటూ అలరించారు. రాంబాబు వసుధ లు "ఈనాటి ఈహాయీ" అంటూ పాత పాట తో అలరిస్తే, రవికాంత్ సమీర లు "వయ్యారి గోదారమ్మ" అంటూ గోదారిని పరవళ్లు తొక్కించారు. వేదవ్యాస్ గాయత్రి లు "వానా వానా వెల్లువాయే" అంటూ వాన వెల్లువ ను వర్ణిస్తే, రవికాంత్ వసుధ లు "ఘల్లు ఘల్లు ఘల్లు మంటు" అని ఘల్లున మ్రోగించారు. గుర్గావ్ నుంచి వచ్చిన దీపక్ హిందీ పాటలతో అదరగొట్టారు. పురుషుల యుగళాలు కూడా అలరించాయి.
ఈ కార్యక్రమం ఆద్యంతం అనురక్తి గా సాగింది. కొత్త గాయనీ గాయకులు కూడా పాల్గొన్నారు. ఈ 17 వ సంగీత విభావరి లో శ్రీయుతులు రవికాంత్, శ్రీ కుమార్, చైతన్య, రాంబాబు, దీపక్, వేదవ్యాస్ లు, శ్రీమతులు సమీర, గాయత్రి, యశోద, అభిమైత్రి, శ్రీ రాణి, వసుధ లు అత్యంత ఉత్సాహంతో పాల్గొని, తమ తమ భావ స్ఫోరకమైన పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించారు. ప్రేక్షకులు రవికాంత్ పాటలకే కాక యాంకరింగ్ కు కూడా పరవశించి తమ అభిప్రాయాలను సందేశాల రూపంలో తెలియపరచారు.
ఈవిధంగా "స్వర బృందావనం" 17 వ సంగీత విభావరి కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగి ఇంకా ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల కు కలిగించింది.