ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో గుట్టుచప్పుడు వేలం!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని దిన సంత, వారపు సంత, కబేలా, వాహనాల మెట్టల వేలం పాటలు బుధవారం కార్యాలయ ఆవరణంలో నవ్వులాటగా సాగాయి. వేలం సమాచారం పట్టణంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆవరణంలో కుర్చీలు, షామియానాలు వేసినంత సమయం కూడా వేలం జరగకపోవడం గమనార్హం. కాంట్రాక్టర్లు ముందుగానే ‘సిండికేట్’ అయి, కేవలం ఒకే పార్టీకి చెందిన వారు మాత్రమే పాల్గొని నామమాత్రంగా ముగించేశారు.సాధారణంగా డిపాజిట్ రుసుము కట్టిన వారికే వేలంలో అవకాశం ఇవ్వాలి. కానీ, ఈసారి నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, డిపాజిట్లు లేకుండానే కాంట్రాక్టర్లను అనుమతించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు, వాహనాల మెట్ట వద్ద మున్సిపాలిటీ నిర్దేశించిన ధర కంటే కాంట్రాక్టర్లు రెండింతలు వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత ఏడాది వచ్చిన ఆదాయ వివరాలు చెప్పకుండానే ఈ ఏడాది వేలం ముగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వేలం ఆదాయ వివరాలను, దానితో చేసిన అభివృద్ధిని బహిరంగపరుస్తారో లేదో వేచి చూడాలి.