టేకులపల్లి మండలంలో గిరిజన రైతులకు బ్యాంకు రుణాల నిరాకరణ సేవాలాల్ సేన ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఎస్బీఐ, ఏపీజీబీ, డీసీసీబీ బ్యాంకులు ఫారెస్ట్ మెమోల ఆధారంగా రైతులకు పంట రుణాలు మంజూరు చేయకుండా నిరాకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా ఐటీడీఏ కార్యాలయంలో ఫారెస్ట్ మెమోలపై పాస్బుక్కులు జారీ చేయకపోవడంతో గిరిజన రైతులు బ్యాంకు రుణాలకు అర్హత కోల్పోతున్నారని తెలిపారు. దీంతో వ్యవసాయం నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యను ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లిన ధరావత్ కృష్ణ నాయక్, వెంటనే చర్యలు తీసుకుని ఫారెస్ట్ మెమోలపై పాస్బుక్కులు జారీ చేయాలని, బ్యాంకులు రైతులకు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గిరిజన రైతులకు న్యాయం చేయకపోతే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.