మమత బెనర్జీకి షాకిచ్చిన 60 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు- మూకుమ్మడిగా
పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.
ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. అదే సమయంలో తృణమూల్ సీనియర్ నేతలపై భౌతిక దాడులు చోటు చేసుకుంటోన్నాయి.
ఈ పరిణామాల మధ్య మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ తగిలింది. కొత్తగా ఎన్నికైన 60 మంది ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. మమత బెనర్జీ నివాసంలో ఏర్పాటుచేసిన తృణమూల్ శాసన సభాపక్ష సమావేశానికి డుమ్మా కొట్టారు. ఫలితంగా ఈ సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో 80 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. వారిలో 20 మంది మాత్రమే హాజరుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మమత బెనర్జీ.
టీఎంసీ సీనియర్ నాయకులు, లోక్ సభ సభ్యులు అభిషేక్ బెనర్జీ కళ్యాణ్ బెనర్జీపై భౌతికదాడులు జరగడం, పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక పరిస్థితులపై చర్చించడం, ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై చర్చించడానికి మమత బెనర్జీ కోల్ కత కాళీఘాట్ లోని తన నివాసంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు.
దీనికి 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం, 20 మందే హాజరు కావడంతో రద్దు చేయాల్సి వచ్చింది. దీనిపై తృణమూల్ వివరణ ఇచ్చింది. పోలీసుల ఒత్తిళ్ల కారణాల వల్ల చాలా మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేకపోయారని పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వివరించారు. దాదాపు మూడొంతుల మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో పలు అనుమానాలు రేకెత్తాయి.
వీటిని కునాల్ ఘోష్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలు నిరసనలు, అరెస్ట్ అయిన కార్యకర్తలకు సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నందున రాలేకపోయారని అన్నారు. సమావేశాన్ని వాయిదా వేయమని ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్లాక్, వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో జరగాల్సిన నిరసన ప్రదర్శనల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని, అవి యధాతథంగా కొనసాగుతాయని కునాల్ ఘోష్ చెప్పారు. కోల్కతాలో మమతా బెనర్జీ స్వయంగా నిరసన దీక్ష చేపట్టనున్నారని పేర్కొన్నారు.