logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సాలూరు మున్సిపాలిటీ లో వార్డుల విభజన పై రభస



29 నుంచి 32కి పెరిగిన వార్డులు.. 5వ వార్డు విభజనపై భగ్గుమన్న స్థానికులు
అస్తవ్యస్తంగా వార్డును ముక్కలు చేశారంటూ మున్సిపల్ కమిషనర్‌కు జనసేన నాయకుడు గుమ్మా నాగార్జున, స్థానికుల వినతి
ఓటు బ్యాంకును, రిజర్వేషన్లను దెబ్బతీసే కుట్ర అంటున్న రెల్లి వీధి ప్రజలు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో డీలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. మున్సిపాలిటీలో గతంలో 29 వార్డులు ఉండగా, ఇప్పుడు వాటిని 32 వార్డులుగా విభజిస్తున్నారు. అయితే, ఇందులో భాగంగా 5వ వార్డును అశాస్త్రీయంగా విభజించారని ఆ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీ, రెల్లి వీధికి చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 5వ వార్డు మాజీ కౌన్సిలర్, జనసేన నాయకుడు గుమ్మా నాగార్జున ఆధ్వర్యంలో వార్డు ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ టి. రత్నకుమార్‌కు తమ అభ్యంతరాలను తెలుపుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకుడు గుమ్మా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... "గత 20 సంవత్సరాలుగా సూర్య మహల్ దగ్గర నుంచి రెల్లి వీధి వరకు 5వ వార్డు ఒకే విధంగా ఉండేది. ప్రజలు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లడానికైనా, నాయకులను కలవడానికైనా ఎంతో అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో ఈ వార్డును అడ్డగోలుగా ముక్కలు చేశారు. ఒక ముక్క తీసుకువెళ్లి చంద్రంపేట, టిట్కో ఇళ్ల వైపు, మరో ముక్కను శివరాంపురం రోడ్డు వైపు, ఇంకో ముక్కను పెద్ద వీధి వైపు కలిపేశారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అస్తవ్యస్త విభజనపై కమిషనర్‌కు అబ్జెక్షన్ లెటర్ ఇచ్చాము. ఈ సమస్యను కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రమేష్ బాబు, రామకృష్ణల దృష్టికి తీసుకెళ్లాము. అలాగే రాబోయే రోజుల్లో మంత్రి సంధ్యారాణి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లి, గతంలో 5వ వార్డు ఎలా అయితే ఉండేదో యథాతథంగా అదే విధంగా కొనసాగించేలా చూస్తాము" అని తెలిపారు.
**స్థానిక రెల్లి కమ్యూనిటీ పెద్దలు మాట్లాడుతూ...**
"వార్డును ఇలా ముక్కలు చేయడం వల్ల మా రెల్లి సామాజిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుంది. రేపు పొద్దున మాకు రిజర్వేషన్ వచ్చినా సరే, ఓట్లు చీలిపోవడం వల్ల మెజారిటీ ఉండదు. కాబట్టి పాత నిబంధనల ప్రకారమే, గతంలో ఉన్నట్టుగానే 5వ వార్డును ఉంచాలి" అని కోరారు.
ప్రస్తుతం ఈ 5వ వార్డు విభజన అంశం సాలూరులో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వార్డు స్వరూపాన్ని మార్చుతారా లేదా అనేది వేచి చూడాలి.

147
7054 views

Comment