logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అది ఆలయ భూమే.. వెయ్యి కోట్ల విలువైన భూమికి కంచె వేయండి.. హైకోర్టు తీర్పు

హైదరాబాద్, మే 16,(GIT): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలోని 14.10 ఎకరాల భూమి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానిదేనని హైకోర్టు తేల్చింది.సర్వే నంబర్ 348/1లోని రూ.వెయ్యి కోట్ల విలువైన ఈ భూమి చుట్టూ 12 వారాల్లోగా కంచె ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీర్పు చెప్పారు.

ఆలయం తరఫున చైర్మన్ నరేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఆలయ భూమిని కొందరు ఆక్రమించి ప్లాట్లు వేయడం, అనధికారిక నిర్మాణాలు చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవలేదని పేర్కొన్నారు. న్యాయవాది కె.ఎం.మహేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆక్రమణలను తొలగించి ఆలయ భూమిని కాపాడాలని కోరారు. ఇందిరాగౌడ్ అనే మహిళ ఆలయ భూమిలో 1.20 ఎకరాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఆక్రమణలను తొలగించాలంటూ గత ఏడాది డిసెంబర్లో అధికారులకు వినతిపత్రం ఇచ్చినా చర్యలు లేవన్నారు.

ఆ భూమిలో ఆర్టీసీ వినియోగిస్తున్న గదులకు అద్దె రూపంలో నెలకు రూ.29 వేల చెల్లింపులు ఆలయానికి వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. దీనిపై దేవాదాయ శాఖ తరఫున న్యాయవాది స్పందిస్తూ, 2013లోనే ఆలయ భూముల సర్వే కోసం సర్వే శాఖకు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ లేఖ రాశారని తెలిపారు. ఆలయానికి తగిన ఆదాయం లేకపోవడంతో కంచె ఏర్పాటు చేయలేకపోయినట్లు చెప్పారు. ప్రతివాది ఇందిరాగౌడ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం ఈ భూమిని తన క్లయింట్తోపాటు మరికొందరు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిందని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు, ఆలయ భూమికి కంచె ఏర్పాటు బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించింది.

0
0 views

Comment