జనసైనికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. ఒంటరిగానే బరిలోకి: పవన్ కళ్యాణ్.
AIMA న్యూస్ బ్యూరో..గత 15 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పార్టీని నిలబెట్టిన జనసేనాని. ఈసారి తన కార్యకర్తల ఆత్మగౌరవం విషయంలో అస్సలు తగ్గకూడదని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వంలో లేదా పొత్తులలో జనసేన కార్యకర్తలకు తగిన గుర్తింపు, న్యాయం జరగడం లేదనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో ఉందనే విషయాన్ని ఆయన గమనించారు.నా కార్యకర్తలకు, నమ్ముకున్న సైనికులకు అన్యాయం జరిగితే. ఒంటరిగా అయినా సరే బరిలోకి దిగుతాం. అని పవన్ ప్రకటించడం వెనుక మిత్రపక్షాలకు గట్టి హెచ్చరిక దాగి ఉంది. భాగస్వామ్య పక్షాలు జనసేనను తక్కువగా అంచనా వేస్తే, తాము ఏ క్షణంలోనైనా సొంత పంథాలో వెళ్లడానికి వెనుకాడబోమని ఆయన తేల్చి చెప్పారు. మొన్న మంగళగిరిలో జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తుల కంటే తనకు తనను నమ్ముకున్న సైనికులే ముఖ్యమని ఈ వ్యాఖ్యల ద్వారా నిరూపించారు. జై అమరావతి కాదు. జై ఆంధ్ర అనాలి ప్రాంతీయ సమగ్రత వ్యూహం.పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన అత్యంత కీలకమైన మరియు చర్చనీయాంశమైన వ్యాఖ్య అమరావతి కాదు, జై ఆంధ్ర అనాలి.రాజధానిగా అమరావతిని సమర్థిస్తూనే, ఆయన ఈ సరికొత్త నినాదాన్ని ఎత్తుకోవడం వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం ఉంది.అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక నిర్దిష్ట వర్గానికి పరిమితమైన అంశంగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక రకమైన దూరం పెరుగుతోందనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ "జై ఆంధ్ర" అనడం ద్వారా. రాజధానితో పాటు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ నీటి సమస్యలు, కోస్తా తీరప్రాంతాల అభివృద్ధి ఇలా సమగ్ర ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ను తెరపైకి తెచ్చారు. ఒకే ప్రాంతం చుట్టూ రాజకీయం తిరగడం కాకుండా, రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలందరినీ ఏకం చేయడమే ఆయన అంతర్గత ఉద్దేశం. తాము కేవలం ఒక ప్రాంత ప్రయోజనాల కోసం పని చేయడం లేదని, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పడమే దీని వెనుక ఉన్న అసలు రహస్యం.
మంగళగిరి సభతో పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ గేర్ను పూర్తిగా మార్చేశారు. ఇకపై జనసేన ఎవరి వద్దా లొంగి ఉండే ప్రసక్తే లేదనే సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చారు.కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న పార్టీలకు తలొగ్గే ప్రసక్తే లేదని, సీట్ల కేటాయింపులో గానీ, ప్రభుత్వ నిర్ణయాల్లో గానీ జనసేనకు సమాన ప్రాధాన్యత ఉండాలని డిమాండ్ చేయడమే ఈ మార్పుకు కారణం.ఒకవేళ పొత్తులు వికటించినా, ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మెజారిటీ సాధించగలమనే ధీమాను కార్యకర్తల్లో నింపేందుకే ఈ వ్యూహాత్మక అడుగు పడింది.మొత్తానికి పవన్ కళ్యాణ్ మారిన స్వరం కూటమి రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టిస్తోంది. జై ఆంధ్ర. అనే నినాదం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలను, ప్రాంతాలను ఏకం చేస్తూనే. కార్యకర్తల రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా, ఒంటరి పోరాటానికైనా సిద్ధమని పవన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిణతికి, భవిష్యత్తు ముందస్తు వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తాయో చూడాలి.