పాల్వంచలో రేపు మెగా జాబ్ మేళా120 ఉద్యోగ ఖాళీల భర్తీకి కసరత్తు
జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం, మే 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన (శనివారం) పాల్వంచలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాల్వంచ పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో శనివారం ఉదయం 10 గంటల నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ప్రముఖ కంపెనీల్లో కొలువులు:
ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ మరియు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి.
అపోలో ఫార్మసీ: హైదరాబాద్లోని సంస్థలో 100 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ మరియు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హతను బట్టి నెలకు రూ. 12,500 నుండి రూ. 25,000 వరకు జీతం ఉంటుంది.
*శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్* :
కొత్తగూడెం బ్రాంచ్ కోసం 20 బిజినెస్ డెవలప్మెంట్ మరియు యూనిట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరికి రూ. 17,500 నుండి రూ. 30,000 వరకు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
*అర్హతలు - సూచనలు* :
19 నుండి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఎస్ఎస్సి నుండి డిగ్రీ, బి.టెక్, ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వెంట విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలి. జిల్లాలోని అన్ని మండలాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
మరిన్ని వివరాలకు 7207917714 (అపోలో) లేదా 9866774459 (శ్రీరామ్ ఇన్సూరెన్స్) నంబర్లను సంప్రదించవచ్చు.