*మల్లారెడ్డిపై 'గులాబీ' బాస్ ఫైర్*
*మల్లారెడ్డిపై 'గులాబీ' బాస్ ఫైర్*
*ఎమ్మెల్యే మల్లారెడ్డిపై 'గులాబీ' బాస్ ఫైర్*
*జోకర్లా వ్యవహరించొద్దు..!*
- *అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీతో మంతనాలపై ఆగ్రహం*
-
- ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
-
ఢిల్లీకి వెళ్లి కుటుంబంతో సహా ప్రధాని మోడీని కలవడం, అనంతరం ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి ముఖ్య నాయకులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనిపై పలు వార్తలు, కథనాలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యేపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకుని క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపైనా కేసీఆర్ ఆరా తీశారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలతో టచ్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'పార్టీలో ఉంటవా..? బయటకు పోతవా..?' అని గట్టిగా అడిగేసరికి మల్లారెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది.
జోకర్లా వ్యవహరించొద్దు..!
సోషల్ మీడియాలో మల్లారెడ్డి చేసే హడావుడిపైనా కేసీఆర్ చురకలు అంటించినట్టు తెలిసింది. 'సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కాదు.. ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. ఒక బాధ్యతగల నాయకుడిలా హుందాగా ప్రవర్తించు.. జోకర్లా వ్యవహరించొద్దు' అని ఘాటుగా మందలించినట్టు తెలిసింది.
*మేడ్చల్ రిపోర్ట్ ఎందుకు రాలేదు?*
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఈ సమావేశంలో రిపోర్టులను సమీక్షిస్తున్న తరుణంలో మేడ్చల్ సెగ్మెంట్ నుంచి బూత్ స్థాయి నివేదిక అందకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 'మిగతా నియోజకవర్గాల నుంచి రిపోర్టులు వస్తుంటే.. మేడ్చల్ నుంచి ఎందుకు రాలేదు? అసలు అక్కడ ఏం జరుగుతోంది?' అని మల్లారెడ్డిని నిలదీసినట్టు సమాచారం. నియోజకవర్గంలో నాయకత్వ సమన్వయం లోపించిందని, గ్రౌండ్ లెవల్లో పార్టీని గాలికి వదిలేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చివరకు మల్లారెడ్డి స్పందిస్తూ.. తన విద్యా సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అధికారులను, నేతలను కలవాల్సి వచ్చిందని, ప్రధానిని కలిసింది కేవలం మర్యాదపూర్వకమేనని వివరణ ఇచ్చుకున్నట్టు టాక్. బీఆర్ఎస్ను వీడబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏది ఏమైనా, పార్టీ సమావేశంలో మల్లారెడ్డికి క్లాస్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.