ఉయ్యాలవాడ గంగ జాతర: భద్రతా నియమాలు కఠినతరం - ఎస్సై రామిరెడ్డి.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ తాలూకా మండల కేంద్రమైన ఉయ్యాలవాడలో వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఉయ్యాలవాడ ఎస్సై రామిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ముఖంగా భక్తులకు మరియు ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ నెల 28, 29వ తేదీలలో రేపు, ఎల్లుండి.జాతర రద్దీ దృష్ట్యా ఆళ్లగడ్డ నుంచి ఉయ్యాలవాడ మీదుగా జమ్మలమడుగు, కోవెలకుంట్ల పట్టణాలకు వెళ్లే భారీ వాహనాలు, ఇతర వాహనదారులు దొర్నిపాడు మీదుగా వెళ్లాలని సూచించారు.గ్రామానికి నాలుగు వైపుల నుంచి వచ్చే భక్తుల వాహనాల కోసం 4 ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని, వాహనాలను రోడ్లపై నిలిపి ట్రాఫిక్కు ఆటంకం కలిగించకూడదని కోరారు.
బంగారు ఆభరణాల జాగ్రత్త: జాతరలో జనసమ్మర్థం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, మహిళలు తమ మెడలోని బంగారు గొలుసులు, ఆభరణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.జాతరకు వచ్చే చిన్న పిల్లల జేబుల్లో వారి పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్ రాసిన చీటీలను ఉంచాలి. పిల్లలు తప్పిపోతే వెంటనే సమీపంలోని పోలీసులను సంప్రదించాలి.
గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే తీపి పదార్థాలను గానీ, పానీయాలను గానీ స్వీకరించవద్దని తెలియజేశారు.
మద్యం సేవించి జాతరలో గొడవలు సృష్టించే వారిపై, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.దర్శనం కోసం క్యూలైన్లలో క్రమశిక్షణతో వ్యవహరించాలని, వృద్ధులకు మరియు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జాతర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ముగిసేలా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.