దొంగ సంతకాల గుట్టు రట్టు. పీహెచ్సీ సిబ్బందిపై కలెక్టర్ రాజకుమారి సీరియస్.
AIMA న్యూస్. నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం జరిగిన ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:10 గంటలకు కలెక్టర్ పీహెచ్సీకి చేరుకోగా, అప్పటివరకు ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ విధులకు హాజరు కాలేదు. అయితే, విధులకు రాని ఈ నలుగురు సిబ్బంది తరఫున MPHO (మల్టీ పర్పస్ హెల్త్ ఆర్గనైజర్) మూమెంట్ రిజిస్టర్లో ముందుగానే సంతకాలు చేయడం కలెక్టర్ను విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, విధులకు గైర్హాజరైన వారిని కాపాడే ప్రయత్నం చేసినందుకు గానూ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.విధులకు రాని నలుగురు సిబ్బందితో పాటు, వారికి సహకరించిన MPHO పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, రిజిస్టర్లను తనిఖీ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.ఆసుపత్రి ప్రాంగణం, గదులు అపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిని మందలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని,వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు అని ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి గణియా హెచ్చరించారు.