అహింస, సత్యం మార్గంలో పయనించడమే భగవాన్ మహావీరునికి ఇచ్చే అసలైన నివాళి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 31, 2026_ఆదిలాబాదు:
అహింస, సత్యం మార్గంలో పయనించడమే భగవాన్ మహావీరునికి ఇచ్చే అసలైన నివాళి అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్థానిక రాణిసతిజీ కాలనీలోని మహావీర్ భవన్లో మంగళవారం భగవాన్ మహావీర్ స్వామి జన్మ కళ్యాణక్ మహోత్సవం (మహావీర్ జయంతి) వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, జైన్ సమాజం పరిమాణంలో చిన్నదైనప్పటికీ, వారు పాటించే సూత్రాలు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.
భగవాన్ మహావీరుడు బోధించిన సత్యం, అహింస అనే సూత్రాలు కేవలం జైన్ సమాజానికి మాత్రమే పరిమితం కాదని, అవి యావత్ మానవాళికి దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. గతంలోనూ ప్రధానమంత్రి జైన్ సమాజం యొక్క ప్రాముఖ్యతను వివరించారని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో భాగంగా పేదలకు, అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వైద్యులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, వ్యాపారవేత్తలు పేదలకు పౌష్టికాహారం అందించడం వంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. మహావీర్ జయంతి రోజున అహింసను చాటిచెప్పేలా మాంసాహార విక్రయశాలలను మూసివేయడంపై అమలు చేసే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. "జీవించు - జీవించనివ్వు" అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, మనుషులకే కాకుండా మూగ జీవాలకు, ప్రకృతికి కూడా హాని తలపెట్టకూడదని ఉద్ఘాటించారు. జైన్ సూత్రాలను చిన్నతనం నుంచే పిల్లల్లో పెంపొందించడం ద్వారా వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం జైన్ సమాజం ప్రతినిధులు కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జైన్ సమాజం ప్రతినిధులు అజయ్ కుమార్ బోగవత్, రుషబ్ కందర్, విపుల్ కందర్, ధరమ్ చాంద్ చౌదరి, భక్తులు, అధికారులు, సిబ్బంది, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.