గాజువాకలో ఉద్రిక్తత.. రవీంద్రపై మృతురాలి బంధువులు దాడి
విశాఖపట్నం గాజువాకలోని ఎల్ వీ నగర్లో ఓ నేవీ ఉద్యోగి చేతిలో మౌనిక (29) అనే మహిళ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
కాగా.. ఈ కేసులో నిందితుడు రవీంద్రతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు అతని ఫ్లాట్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మృతురాలి బంధువులు రవీంద్రపై దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. తన కూతురు మౌనిక అమాయకురాలని, రవీంద్రే ఆమెను ట్రాప్ చేశాడని తండ్రి వాపోయారు. ఏ పాపం తెలియని తన కూతురిని పొట్టనపెట్టుకున్నాడని ఆరోపించారు.
కాగా.. మౌనికను హత్య చేసిన పరిస్థితులపై రవీంద్ర చెప్పిన విషయాలు మరోవిధంగా ఉన్నాయి. 2020లో డేటింగ్ యాప్ లో మౌనికతో ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యంగా మారిందని, మూడేళ్ల తర్వాత బ్రేకప్ అయిందని తెలిపాడు. అయితే.. ఇటీవల తన ఐడీ కార్డును ఆమె తీసుకుందని, ఉద్యోగానికి ఇబ్బందవుతుందని ఎంతచెప్తున్నా వినలేదన్నాడు. ఈ క్రమంలో ఐడీ కార్డు గురించి మాట్లాడేందుకే ఫ్లాట్ కు పిలవగా.. ఆదివారం మధ్యాహ్నం తర్వాత తీవ్ర వాగ్వాదం జరిగిందని, కోపంలో ఆమెను గొంతునులిమి చంపాక, ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు పోలీసుల విచారణలో చెప్పాడని సమాచారం. కానీ మౌనికను రవీంద్ర పక్కా ప్లాన్ ప్రకారమే చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.