గాదెలదిన్నెలో రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు
విడవలూరు మండలం గాదెలదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవితంలో మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతే మార్గమని పేర్కొన్నారు. ఆలయాలు హైందవ సంస్కృతికి ప్రతీకలని, భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను అందించడంలో వాటి పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.