కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.
📰 అభివృద్ధి పథంలో కోవూరు నియోజకవర్గం – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో 47 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వావిళ్ళ గ్రామస్తుల 15 ఏళ్ల నాటి సీసీ రోడ్డు కలను నెరవేర్చామని చెప్పారు. అలాగే విడవలూరు-వావిళ్ళ కనెక్ట్ రోడ్డుకు 1 కోటి 30 లక్షలు మంజూరై, త్వరలో పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. గ్రామంలో 52 లక్షలతో అంతర్గత రోడ్లు, 36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి ప్రభుత్వం “సూపర్ హిట్” సాధించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార సేవలో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి స్త్రీ శక్తి పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 800 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 8 కోట్ల రూపాయలు అందించామని వివరించారు.
గత 30 ఏళ్లుగా నిలిచిపోయిన ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామని, దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలో వావిళ్ళ గ్రామంలోని 56 డ్వాక్రా గ్రూపులకు చెందిన 301 మంది సభ్యులకు స్త్రీ నిధి, బ్యాంకు లింకేజి ద్వారా 3 కోట్ల 74 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
కూటమి పాలనలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, స్మశానవాటికలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. రైతులకు గోనె సంచులు, రవాణా సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంటూ, అధికారులతో సమన్వయం చేసి రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.