తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
అభినందించారు. వాసవీ అమ్మవారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, అందుకు సంబంధించి శాసనసభ సమావేశాలు ముగిసేలోగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
✅ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. “రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక లాంటి వారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాకుండా సంస్కృతి, ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు.
✅ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుంది. మీ ఆలోచనలే ప్రజా ప్రభుత్వం. ఆర్యవైశ్యుల గుర్తింపు విషయంలో ఎలాంటి భంగం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం.
✅ ఈ మహోత్సవంలో వాసవీ సామూహిక పారాయణం గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుంది.
✅ అహింసతో ఒక యుద్ధాన్ని గెలవొచ్చని నిరూపించిన గొప్ప తత్వవేత్త మహాత్మ గాంధీ గారు ఈ జాతిలో పుట్టడం భారతదేశానికే గర్వకారణం. అహింస, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చన్న నూతన విధానాన్ని మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి పరిచయం చేశారు.
✅ మహాత్మా గాంధీ గారి వారసత్వంలో శాంతియుతంగా అహింసా మార్గంలో ఈ దేశ అభివృద్ధికి, రాజకీయాల్లో అవకాశాలు వచ్చినా, రాకున్నా ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఆర్యవైశ్యలు దేశంలో గుర్తింపు సాధించారు.
✅ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలంగాణలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుంది. మీ అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలు, కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. మీ గుర్తింపు, గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూస్తాం” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
✅ ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్త గారు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు బెల్ది శ్రీధర్ గారితో పాటు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు.