శాంతినగర్ PHCలో స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 20, 2026_ఆదిలాబాదు:
స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపులో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించి, చికిత్స వివరాలపై ఆరా తీసి వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇటువంటి స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులతో సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా క్యాంపులలో గుర్తించిన రిఫరల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులకు సూచించారు. దంతన్పల్లి పిహెచ్సిలో గుర్తించిన 10 మంది కంటి వ్యాధిగ్రస్తులలో 5 మందికి రిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా ఆపరేషన్లు చేయించినట్లు గుర్తు చేశారు. నేటి క్యాంపులో కూడా పీడియాట్రిక్, కార్డియాలజీ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి, మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు రిఫర్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణ కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, మరో 5-6 రోజుల్లో అదనపు కార్మికులు అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచడానికి సిఎస్ఆర్ నిధులతో మరిన్ని స్వచ్ఛ ఆటోలను సమకూర్చుతామని వెల్లడించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నిరోధించేందుకు ‘గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల’ వద్ద సీసీటివి కెమెరాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు, జిల్లా ప్రజలకు రంజన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక లో భాగంగా 33 వార్డు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రోడ్డా వాసవి - రవి దంపతుల గృహ ప్రవేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం 35, 33 వ వార్డులో శానిటేషన్ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ వార్డుల కౌన్సిలర్లు మౌనిక, సయ్యద్ మెహబూబ్, సుచిత, జ్యోతి, నర్మదా, వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, లబ్ధిదారులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.