మున్సిపాలిటీల్లో ముగిసిన నాయకుల పాలన. ఇప్పటి నుండి అధికారుల పాలన.
AIMA న్యూస్ బ్యూరో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురపాలకశాఖ లో ప్రజా ప్రతినిధుల సందడి ముగిసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలక వర్గాల గడువు ముగియడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయా సంస్థల్లో అధికారుల పాలనకు తెరలేపుతూ ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్నికల వరకు వారే బాధ్యులు స్థానిక సంస్థలకు తిరిగి ఎన్నికలు జరిగి, కొత్తగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారులే పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. మొత్తం 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఈ నియామకాలు వర్తిస్తాయి. గరిష్టంగా ఆరు నెలల పాటు లేదా కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు వీరు బాధ్యతల్లో ఉంటారు. ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని, పౌర సేవల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. పాలకవర్గాల గడువు తీరడంతో మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు.పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, నీటి సరఫరా వంటి అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, పారదర్శకమైన పాలన అందించడమే ఈ స్పెషల్ ఆఫీసర్ల నియామక ప్రధాన లక్ష్యం. నేటి నుండి మున్సిపల్ కార్యాలయాల్లో రాజకీయ నేతల హడావుడి తగ్గి, అధికారుల పర్యవేక్షణ పెరగనుంది. బడ్జెట్ ఆమోదం నుండి అభివృద్ధి పనుల వరకు అన్నీ ఇక అధికారుల కనుసన్నల్లోనే జరగనున్నాయి.