పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగాలి
పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 14, 2026-ఆదిలాబాద్ :
జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఆదిలాబాద్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్న సరస్వతి శిశు మందిర్, వినాయక్ చౌక్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల-2 కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి గదిని తిరుగుతూ పరీక్ష జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెలుతురు, ఫ్యాన్లు, తాగునీరు, బెంచీలు వంటి కనీస మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? అని స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఆరా తీస్తూ.. హాజరు శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. "విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాసేలా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే, పరీక్షలు ముగిసే వరకు ఇదే అప్రమత్తత కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ
తహసీల్దార్ శ్రీనివాస్, ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.