ఐటీ ఎకోసిస్టమ్ విశాఖకు మాత్రమే సొంతం
'దేశంలో మరే ప్రాంతంలో లేని ఐటీ ఎకోసిస్టమ్ విశాఖకు మాత్రమే సొంతం.
అన్నివిధాలా అనుకూలతలు కలిగిన ఈ నగరంలో 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయండి’ అని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ క్యాప్ జెమిని ప్రతినిధులను కోరారు. గురువారం విశాఖలోని ఓ హోటల్లో లోకేశ్తో క్యాప్ జెమిని గ్లోబల్ సీఈవో ఐమన్ ఎజాత్, ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురగేశ్ భేటీ అయ్యారు.
'క్యాప్ జెమిని డెడికేటెడ్ క్వాంటమ్ వర్టికల్ను స్థాపించడమే కాకుండా ఆప్టిమైజేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లోనూ వాణిజ్య సేవలను విస్తరించేందుకు ఏపీలోని ప్రపంచస్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేయండి. ఇక్కడ ఆధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రం (ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టాలెంట్ పైపైన్) ఏర్పాటు కోసం స్థానిక విశ్వవిద్యాలయాలతో కలిసి సహ భాగస్వామిగ వ్యవహరించండి.
క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకారం
అందించండి' అని లోకేశ్ కోరారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఐటీ, డేటా సెంటర్స్ హబ్గా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 'దేశంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు విశాఖలో త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖకు వచ్చాయి. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుంద'ని లోకేశ్ వివరించారు.