భద్రాద్రి అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సేవలు అభినందనీయం*
*సమగ్ర దృష్టితో ముందుకు నడిపిన దృఢ నాయకత్వం ,
తెలంగాణ స్టేట్ *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ *ఫిబ్రవరి 28*ఏఐఎంఎ మీడియా ప్రతినిధి రబ్బాని*
********"********************
*భద్రాద్రి అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సేవలు అభినందనీయం*
సమగ్ర దృష్టితో ముందుకు నడిపిన దృఢ నాయకత్వం – ప్రజామమేక పరిపాలనకు కొత్త నిర్వచనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి గాథలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన పరిపాలన అంటే జితేష్ వి. పాటిల్ నాయకత్వమే అని చెప్పాలి. 2024 జూలై 16న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాముని దర్శనానికి వెళ్తున్న సమయంలో బూర్గంపాడు సమీపంలో ప్రమాదం జరిగి గాయపడిన క్షతగాత్రులను ఆయన స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. 26 ఫిబ్రవరి 2026 వరకు తన పదవీకాలంలో జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా స్పష్టమైన విజన్తో ముందుకు నడిపించారు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, యువత సాధికారత, విద్యా–ఆరోగ్య రంగాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం, రహదారి మౌలిక వసతులు వంటి ప్రతి విభాగంలో సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి అభివృద్ధిని ప్రజల దైనందిన జీవితాలకు చేరువ చేశారు.
తన పరిపాలనలో పారదర్శకత, ఫలితాల ఆధారిత అమలు, ప్రజలతో మమేకం, శాఖల సమన్వయం, 24 గంటల అందుబాటు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి అంశాలు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. యాస్పిరేషన్ జిల్లా పురోగతిలో మూడు జాతీయ అవార్డులు గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి సంపూర్ణ అభి యాన్ అవార్డు, నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీ షనర్ అవార్డు, జల సంచయ్ జల్ భాగీదారీ అవార్డులు సాధించడం ఆయన సమర్థ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది.
*వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు*
రైతు కుటుంబంలో జన్మించిన పరిపాలకుడిగా రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మునగ సాగు, అంతర పంటలు, పెరటి కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు వంటి అనుబంధ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించి రైతుల ఆదాయ వనరులను విస్తరించారు. ఫామ్ పౌండ్లలో చేపల పెంపకాన్ని ప్రవేశపెట్టి సమీకృత వ్యవసాయ విధానాన్ని అమలు చేశారు.
సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ బయోచార్ తయారీని స్వయంగా ప్రదర్శించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధ్యమని రైతుల్లో అవగాహన కల్పించారు. వ్యవసాయాన్ని నష్టరహిత రంగంగా కాకుండా లాభదాయక రంగంగా మలచాలనే దృఢ సంకల్పంతో రైతుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
*యువత & మహిళల సాధికారత*
నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా శిక్షణలు, ఫర్నిచర్ తయారీ యూనిట్లు, “గురు–శిష్య హస్తశిల్పి” కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారు. పలు ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.
మహిళా సంఘాలకు సమీకృత వ్యవసాయం, కౌజు పిట్టల పెంపకం, కూరగాయల సాగు, మేకల పెంపకం వంటి రంగాల్లో శిక్షణలు అందించి ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ఎగ్జిబిషన్లు, మేళాలు నిర్వహించారు. మహిళా సాధికారతను కుటుంబ స్థాయి నుంచి గ్రామ స్థాయికి విస్తరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు.
*సమీకృత వ్యవసాయ ఫార్మ్ హౌస్లు* – *రైతు కుటుంబానికి స్థిరమైన ఆర్థిక భరోసా*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు ఆదాయం పెంపు దిశగా సమీకృత వ్యవసాయ ఫార్మ్ హౌస్లను ఆదర్శ నమూనాగా అభివృద్ధి చేశారు. ఒకే ప్రాంగణంలో పంటలు, పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి విభిన్న కార్యకలాపాలను సమన్వయంతో నిర్వహించే విధానాన్ని ప్రోత్సహించి “ఒకే భూమి – అనేక ఆదాయ వనరులు” అనే భావనను ప్రజల్లో నాటారు. ఫామ్ పౌండ్లు, సేంద్రియ ఎరువుల తయారీ, కూరగాయలు వంటి సమీకరణతో ఖర్చులు తగ్గించి, సంవత్సరం పొడవునా ఆదాయం వచ్చేలా చక్రాకార వ్యవస్థను అమలు చేశారు. చిన్న, సన్నకారు రైతులకూ లాభదాయకమైన, పర్యావరణహితమైన వ్యవసాయ నమూనాగా ఈ ఫార్మ్ హౌస్లు జిల్లాలో స్ఫూర్తిదాయక మార్గదర్శకంగా నిలిచాయి.
*విద్యా–ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు*
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో కిచెన్ షెడ్, విద్యార్థుల్లో క్రీడా ప్రోత్సాహం అందించేదా అవసరమైన క్రీడా సామాగ్రి అందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులను పూర్తి చేయించారు.
మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక పరికరాల సమకూర్పు, అత్యవసర వాహనాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం వంటి చర్యలతో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. ఆరోగ్య రంగంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకొని ఆయన సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రజలకు సమయానుకూల వైద్య సేవలు అందేలా సమగ్ర పర్యవేక్షణ చేపట్టారు.
*గిరిజనాభివృద్ధి – సిఎస్ఆర్ సమ్మిట్*
గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సమర్థంగా వినియోగిస్తూ జిల్లా స్థాయిలో భారీ సిఎస్ఆర్ సమ్మిట్ నిర్వహించారు. పలు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్య, ఆరోగ్యం, తాగునీరు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించారు. ఇది గిరిజనాభివృద్ధికి కొత్త దిశానిర్దేశంగా నిలిచింది. గిరిజన ఉత్పత్తులు నాయక పోడు మాస్క్ దేశవ్యాప్త గుర్తింపు ప్రత్యేక కృషి చేశారు.
*ఖనిజ సంపదకు శాస్త్రీయ దిశ – భూవిజ్ఞాన కేంద్రంగా భద్రాద్రి*
జిల్లాలో సమృద్ధిగా ఉన్న ఖనిజ సంపద, భౌగోళిక వైవిధ్యంపై సమగ్ర అధ్యయనం జరిపించి, భూవిజ్ఞాన పరిశోధనలకు భద్రాద్రి అనుకూల కేంద్రంగా అభివృద్ధి చెందగలదని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. భూగర్భ వనరులు, ఖనిజ నిల్వలు, జలవనరులు, వాతావరణ మార్పులపై లోతైన పరిశోధనలకు అవసరమైన సహజ వాతావరణం జిల్లాలో ఉన్నదని స్పష్టమైన ప్రతిపాదనలు సమర్పించారు. ఈ దూరదృష్టి ఫలితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సస్ యూనివర్సిటీ స్థాపనకు మార్గం సుగమమై, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను భూ విజ్ఞాన విద్యా–పరిశోధనల జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడింది. ఇది జిల్లా అభివృద్ధికి దీర్ఘకాల శాస్త్రీయ పునాది ఏర్పరిచిన మైలురాయిగా నిలిచింది.
*పర్యావరణ పరిరక్షణలో “భద్రాద్రి మోడల్”*
ఇంకుడు గుంతల ఉద్యమం, ఔషధ మొక్కల నాటకం, సీడ్ బ్యాంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో “భద్రాద్రి మోడల్”ను రూపుదిద్దించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పర్యావరణ చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
*పర్యాటకాభివృద్ధి – భద్రాద్రి ఖ్యాతి.*
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ప్రతి ఆదివారం నదీహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు . శ్రీరామనవమి ముక్కోటి మహోత్సవాల సందర్భంగా పటిష్ట ప్రణాళికలు అమలు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఏరు ది రివర్ ఫెస్టివల్, కిన్నెరసాని రివర్ వాక్ , శ్రీనివాస గుట్ట ట్రెక్కింగ్, బెండలపాడు ఫారెస్ట్ వాక్ వంటి పర్యాటక ప్రదేశాలను మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసి జిల్లాను పర్యాటకపరంగా ముందుకు నడిపించారు.
*క్రీడా ప్రోత్సాహంతో యువతలో స్ఫూర్తి*
జిల్లాలోని క్రీడాకారుల అభివృద్ధికి విశేష ప్రాధాన్యతనిస్తూ ఆధునిక క్రీడా సౌకర్యాల ఏర్పాటు, మైదానాల అభివృద్ధి, అవసరమైన క్రీడా సామాగ్రి సమకూర్పులో ప్రత్యేక కృషి చేశారు. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు వేదిక కల్పించారు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలో క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టి యువతలో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, పోటీ భావనలను పెంపొందించే దిశగా సమగ్ర చర్యలు అమలు చేశారు.
*రహదారి మౌలిక వసతుల బలోపేతం*
రహదారులపై గుంతల సమస్యను శాశ్వత పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు కోల్డ్ మిక్స్ సాంకేతికతను ప్రవేశపెట్టారు. వర్షాకాలంలో కూడా తక్షణ మరమ్మతులు చేపట్టే విధంగా దశలవారీ ప్రణాళిక అమలు చేసి ప్రధాన, గ్రామీణ రహదారులను వేగంగా పునరుద్ధరించారు.
*బ్రిక్స్ ఛాలెంజ్” – తక్కువ ఖర్చుతో నిర్మాణ విప్లవం*
తక్కువ ఖర్చుతో ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ “బ్రిక్స్ ఛాలెంజ్” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. స్థానిక మట్టితో ఇటుకల తయారీని స్వయంగా ప్రదర్శించి యువతను భాగస్వాములుగా మార్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జైశ్రీరామ్ నామంతో ఇటుకల తయారీకి శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత పద్ధతిలో మట్టి ఇటుకలతో నిర్మాణం సాధ్యమని నిరూపించి ఖర్చు తగ్గింపుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించారు.
*ప్రతిష్టాత్మక కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ*
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవం, సీతారామ బహుళార్థక ప్రాజెక్ట్ జాతికి అంకితం, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. అలాగే శ్రీరామనవమి, ముక్కోటి మహోత్సవాలు, మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించి జిల్లా పరిపాలన సామర్థ్యాన్ని చాటిచెప్పారు.
*డ్రోన్ సాంకేతికతతో వేగవంతమైన వరద సహాయం*
వర్షాకాలంలో గోదావరి రివర్ ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైన సందర్భాల్లో డ్రోన్ సాంకేతికతను వినియోగించి చిక్కుకుపోయిన బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి సాచెట్లు మరియు అత్యవసర సరఫరాలను నేరుగా గాల్లో నుంచి దించి అందించి,వరదల సమయంలో సమయానుకూల సహాయక చర్యలు చేపట్టడం విశేషంగా నిలిచింది.
ఉపాధి హామీ పధకం పనులు ల్లో పాల్గొని తాను కూడా కూలీగా పనులు చేసి ఆదర్శంగా నిలిచారు.
జిల్లా అభివృద్ధికి అంకితభావంతో సేవలందించిన జితేష్ వి . పాటిల్ ప్రస్తుతం తెలంగాణ సౌతేర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ రంగంలో సాంకేతిక ఆధునీకరణ, వినియోగదారులకు మెరుగైన సేవలు, పారదర్శక నిర్వహణ వంటి అంశాల్లో కూడా ఆయన కొత్త ప్రమాణాలు నెలకొల్పుతారనే విశ్వాసం వ్యక్తమవుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి చరిత్రలో జితేష్ వి. పాటిల్ పరిపాలన ఒక స్ఫూర్తిదాయక అధ్యాయంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రజల హృదయాల్లో నిలిచే పరిపాలకుడిగా ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి.