జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక
–భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్,
తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ న్యూస్**ఫిబ్రవరి 25:( ఏఐఎంఏ మీడియా న్యూస్ ప్రతినిధి)
జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక
–భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్,
జాతీయ పంచాయతీ అవార్డులు 2023–24లో భాగంగా పచ్చదనం–పరిశుభ్రత విభాగంలో సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామం ఎంపిక కావడం జిల్లా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు . గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాల్లో సాధించిన పురోగతికి గుర్తింపుగా ఈ ఎంపిక జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ సీతంపేట గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య చర్యలను సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలో డ్రైనేజీలు, ఇంకుడు గుంతలు, ఇంటింటి మరుగుదొడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయ సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిలో నిర్మించిన మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, బహిరంగ విసర్జనకు చేయరాదు అని గ్రామస్థులకు సూచించారు.ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని, చెత్త వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీలు ఎక్కడా మూసుకుపోకుండా తరచుగా శుభ్రపరచాలని, ఇంకుడు గుంతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో పురుషులు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.గ్రామంలో పచ్చదనం విస్తరించేందుకు విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలు పెంచి ప్రతి వీధిలో ఖాళీ ప్రదేశాలలో, పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో సీతంపేట గ్రామం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.గ్రామ లైబ్రరీలో 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీల వెంట ఉన్న గుంటలను సరిచేయడానికి అవసరమైన రోలర్ను అందజేస్తామని హామీ ఇచ్చారు. బయోచార్ తయారీ చేసి వచ్చిన బొగ్గుని డ్రైనేజీలలో చల్లడం ద్వారా డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉంటాయి అని ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.త్వరలో జాతీయ స్థాయి పరిశీలన బృందం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పరిరక్షణ, మౌలిక సదుపాయాల సంరక్షణలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాహాసిల్దార్ కృష్ణ ప్రసాద్, శిక్షణ డి పి ఓ అనూష, ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ శ్రీనివాస్, డిఎల్పిఓ ప్రభాకర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.