logo

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారంతో శ్రీకాకుళం జిల్లా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి కారణమిదే..

జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగివున్న వ్యాన్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతులు దాలయ్య, మోహినమ్మగా గుర్తించారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన సున్నాపురం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని వెంటనే టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..

జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారి పక్కన ఆగి ఉండే వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ప్రమాదానికి అధిక వేగం, రోడ్డు పక్కన సరైన హెచ్చరికలు లేకుండా వాహనం ఆగివుండటం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి కారణాల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1
485 views