logo

బీహార్ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలంటూ జన్ సురాజ్ పార్టీ పిటిషన్.....

ప్రజలు తిరస్కరించినా ప్రచారం కోసం పాకులాట.. ప్రశాంత్ కిశోర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

బీహార్ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలంటూ జన్ సురాజ్ పార్టీ పిటిషన్

విచారణకు తిరస్కరిస్తూ పీకే పై సీజేఐ ఫైర్

238 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటూ గెలవలేదని వ్యాఖ్య

‘‘బీహార్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారనేది స్పష్టంగా తెలిసిపోయింది.. ఇప్పుడు మీరేమో ఈ కోర్టును మీ ప్రచారం కోసం వాడుకుని లబ్ది పొందాలని చూస్తున్నారా..?” అంటూ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలంటూ జన్ సురాజ్ పార్టీ తరఫున దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సీజేఐ తిరస్కరించారు. ఈ పిటిషన్ ను బీహార్ హైకోర్టుకు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జన్ సురాజ్ పార్టీ తరఫున హాజరైన లాయర్లకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ, బీజేపీ కూటమి అవకతవకలకు పాల్పడిందని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సంక్షేమ పథకం పేరుతో మహిళలకు రూ.10 వేలు పంచిందని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఒక మహిళకు రూ.10 వేలు అందజేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి ఘన విజయానికి ఇదే కారణమని విమర్శించింది.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని ఆరోపిస్తూ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఫలితాలు చెల్లవంటూ తీర్పు వెలువరించాలని జన్ సురాజ్ పార్టీ కోరింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 238 సీట్లలో పోటీచేసిన జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేదనే విషయాన్ని గుర్తుచేసింది. దీనిని బట్టి బీహార్ ప్రజలు మిమ్మల్ని (ప్రశాంత్ కిశోర్) తిరస్కరించారని స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం న్యాయవ్యవస్థ ద్వారా ప్రచారం పొందేందుకే ఈ పిటిషన్ దాఖలు చేశారని విమర్శిస్తూ పిటిషన్ ను బీహార్ హైకోర్టుకు రీడైరెక్ట్ చేసింది.

0
0 views