
ముంచెత్తనున్న వానలు టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల
ముంచెత్తనున్న వానలు టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల
క్రౌన్ హ్యూమన్ రైట్స్ అమరావతి, నవంబర్ 20:
ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం అమరావతిలో వెల్లడించింది. ఇది పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆ తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు అంటే గురు, శుక్రు, శనివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరి కోతల నేపథ్యంలో రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని స్పష్టం చేసింది.అత్యవసర సహాయం కోసం.. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 42 50101 సంప్రదించాలని రైతులకు విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇక శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.