పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిషేధం: మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి.
మహానంది (AIMA MEDIA): పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు మహానంది మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం గాజులపల్లి గ్రామములో పురుగుమందుల దుకాణాలను ఏవో నాగేశ్వర రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణానికి హాని కలిగించే ప్రమాదకరమైన పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల కమిటీ రూపొందించిన పూర్తి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అరటి పంటలో కలుపు నివారణకు రైతులు ఈ గడ్డి మందును వినియోగిస్తున్నారని, తక్కువ ధరకు లభించడం, సత్వరంగా ఫలితాలు ఇవ్వడం వల్ల దీనికి డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. విషపూరితమైన ఈ గడ్డి మందును ఉపయోగించడం వల్ల వివిధ వ్యాధులు బారిన పడే ప్రమాదముందని, కిడ్నీలు దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, పార్కిన్సన్ వ్యాధి వచ్చే అవకాశముందని తెలిపారు.ఈ గడ్డి మందుపై ప్రభుత్వం నిషేధం విధించిందని, మే 22 నుండి 60 రోజులపాటు ఈ గడ్డి మందులు అమ్మకాలు, వినియోగం, నిల్వపై నిషేధం విధించినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.మండలంలోని పురుగుమందుల దుకాణాల్లో ఈ నిషేధిత పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును అమ్మకాలు చేయకూడదని డీలర్లకు ఏవో హెచ్చరించారు.